జూబ్లీహిల్స్‌లో ఎమ్మెల్యే స్టిక్కర్ తో ఉన్న కారు బీభత్సం.. రెండున్నర నెలల పసికందు మృతి

  • బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ మహ్మద్ స్టిక్కర్‌తో కారు
  • మరో చిన్నారి, ఇద్దరు మహిళలకు గాయాలు
  • కారును వదిలేసి పరారైన నిందితుడు
బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ మహ్మద్ స్టిక్కర్ ఉన్న ఓ కారు గత రాత్రి జూబ్లీహిల్స్‌లో బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. మరో చిన్నారి, ఇద్దరు మహిళలు గాయపడ్డారు.

పోలీసుల కథనం ప్రకారం.. గత రాత్రి 9 గంటల సమయంలో మాదాపూర్ నుంచి తీగల వంతెన మీదుగా జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 45లోని బ్రిడ్జిని దాటి రోడ్డు నంబరు 1/45 చౌరస్తా వైపు ఆ కారు వేగంగా దూసుకొచ్చింది. ఆ సమయంలో అక్కడ పిల్లలను ఎత్తుకుని బెలూన్లు విక్రయిస్తున్న మహారాష్ట్రకు చెందిన కాజల్ చౌహన్, సారిక చౌహాన్, సుష్మ భోంస్లేలను బలంగా ఢీకొట్టింది. దీంతో వారి చేతుల్లో ఉన్న రెండున్నర నెలల రణవీర్ చౌహాన్, ఏడాది వయసున్న అశ్వతోష్ కిందపడ్డారు. చిన్నారులను ఎత్తుకున్న మహిళలకు గాయాలయ్యాయి. 

ప్రమాదం జరిగిన వెంటనే కారు నడుపుతున్న వ్యక్తి దానిని అక్కడే వదిలేసి పరారయ్యాడు. గాయపడిన ఇద్దరు చిన్నారులు, మహిళలను ట్రాఫిక్ పోలీసులు జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పసికందు రణవీర్ చౌహాన్ మృతి చెందినట్టు నిర్ధారించారు. గాయాలపాలైన మరో చిన్నారి, మహిళలకు చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Bodhan
Mohammed Shakil Aamir
Jubilee Hills
Road Accident

More Telugu News